డేవిడ్ లివింగ్ స్టన్ (1813 – 1873)

“అమ్మ! ఇదిగో ఈ వారం ఎంత సంపాదించానో చూడు!” అంటు తన చేతిలోని నాణెల్ని తల్లి ఒడిలో ఆనందంగా వేస్తూ ఉత్సహంతో మాట్లాడుతున్న కుమారుణ్ణి చూస్తూ “డేవిడ్,ఈ డబ్బుతో ఏం చేయాలనుకొంటున్నావు”? అని అడిగింది తల్లి కుటుంబ పేదరికాన్ని గమనించి తాను యేరీతిగానైనా సహాయపడాలనే ఆశతో పనిలోకి వెళ్లిన కుమారుని విద్యాకాంక్ష తల్లికి తెలుసు. నెమ్మదిగా తల్లి మొఖంలోకి చూస్తూ “నీవు ఒప్పుకొంటే లాటిన్ వ్యాకరణ గ్రంధం కొనాలని..”సందేహిస్తూ ఆగాడు. పేదరికం వలన పాఠశాలకు వెళ్ళి విద్య నభ్యసించక పోయినా విద్యావంతుడు కావాలనే పట్టుదల గలవాడు డేవిడ్.
బాల్యం:-
1813 సంవత్సరము మార్చి నెల 19వ తేదీ స్కాట్లాండ్లోలోని పేద క్రైస్తవ కుటుంబములో జన్మించాడు డేవిడ్ లివింగ్ స్టన్. బాల్యం నుండి క్రైస్తవశిక్షణలో పెరిగిన డేవిడ్ తన బైబిల్ శ్రద్ధగా చదవడం అలవరచుకొని తొమ్మిదవ ఏటా 119వ కీర్తన కంఠత చెప్పగలిగేవాడు.పదవయేట పాఠశాల విద్యమాని కుటుంబ సహాయార్ధం నూలు మిల్లులో పనికై చేరాడు. ఉదయము ఆరు గంటలు మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు మిల్లులో పని చేస్తునే లాటిన్ గ్రంధాన్ని ప్రక్కనే పెట్టుకొని చదివేవాడు. అలసి ఇంటికి వచ్చి అర్ధరాత్రి వరకు చదువుతూనే ఉండేవాడు.
స్వయంగా లాటిన్ భాష చక్కగా నేర్చుకొని,విజ్ఞాన శాస్త్రగ్రంధాన్ని చదవడం మొదలు పెట్టాడు. డేవిడ్ నైపుణ్యాన్ని గుర్తించిన యాజమాన్యం వారు అధిక వేతనం లభించే పదవినిచ్చారు. అందువలన వేసవిలో పనిచేసి, శీతాకాలం గ్లాస్కో విశ్వవిద్యాలయంలో గ్రీకు, వైద్యశాస్త్రాన్ని అభ్యసించాడు. వేసవి కాలంలో పనిచేస్తూనే వేదంతా శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడు. స్వయం కృషి వలన విద్యావంతుడైన డేవిడ్,పట్టుదల,కార్యదీక్ష తరువాత జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి.
బాల్యంలో ఆదుకోవడానికి సమయమే లేని డేవిడ్ తన ఏంటి ప్రక్కనున్న నది తీరానికి వెళ్ళటానికి ఎంతో ఇష్టపడేవాడు. చేపలు పట్టడంలో,ప్రకృతిలోని పక్షుల్ని,పూలని,రాళ్ళను పరిశీలించడంలో డేవిడ్ తన సమయాన్ని గడిపేవాడు. ఎన్ని పనులున్నా బైబిల్ శ్రద్ధగా చదివేవాడు. పరిశుద్ధ గ్రందాన్నెంతో ప్రేమించాడు గనుక జీవితంలో ఒంటరిగా నిలువవలసి వచ్చినప్పుడు బైబిల్ అతనికి స్ఫూర్తి నిచ్చింది.
ఆఫ్రికా ప్రయాణం:-
ఇరవై సంవత్సరాలప్పుడు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి,విదేశాల్లో మిషనరీగా పనిచేయాలని తీర్మానించుకొన్నాడు. ఆ సమయంలో చైనా దేశంలో పని చేయడానికి మెడికల్ మిషనరీలు కావాలని ఒక జర్మన్ మిషనరీ డేవిడ్ కు తెలిపాడు. రెండు సంవత్సరాలు వైద్యవిద్య నభ్యసించి చైనాకు వెళ్ళాలని తలంచాడు. కాని దైవ చిత్తం మరోలా నడిపించింది. మన స్వచిత్తానికి ప్రాధ్యానత నివ్వక దైవచిత్తానికి విధేయులమైనప్పుడు, మన ద్వారా దైవచిత్తం నెరవేరచ్చబడును. చైనాలో యుద్ధమున్నందున డేవిడ్ చైనాకు వెళ్లలేకపోయాడు.
దైవచిత్తాన్ని ఎదురుచూస్తున్న సమయంలో ఆఫ్రికాలో మిషనరీగా నున్న రాబర్ట్ మఫత్ లండన్ నగరంలో ఏర్పాటు చేసిన సభలలో ఆఫ్రికా ఖండంలోని సేవ అవసరతల గురించి చెప్పడం జరిగింది. :ఆఫ్రికా దేశపు కీకారణ్యాల్లోని వేలాది కుగ్రామాల్లో పొగను చూసినప్పుడల్లా నిజదేవుని ఎరుగక , నిత్య నాశనమవైపు పరుగులెత్తుతున్న ప్రజలను గుర్తు చేసుకొంటానని” ఆయనచెప్పిన మాటలు డేవిడ్ హృదయన్నెంతో ఆకట్టుకొన్నాయి. ఆఫ్రికాకు ప్రయాణ సమయములో నక్షత్రాల నాధారంగా మార్గన్నేలా కనుగొనాలో నేర్చుకొన్నాడు. దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్ పట్టణములో ఖగోళ శాస్త్రమభ్యసించాడు. ఆఫ్రికా దేశపు దట్టమైన అరణ్యాల్లో ప్రయాణించేటప్పుడు ఈ విజ్ఞానమాయనకెంతో తోడ్పడేది.
ఆఫ్రికా ఖండంలో:-
కేప్ టౌన్ నుండి ఏదుల బండిలో 700 మైళ్ళు ప్రయాణం చేసి రాబర్ట్ మఫత్ నివసిస్తున్న కురుమన్ చేరాడు. అక్కడున్న దినాల్లో తాను చేయవలసిన సేవారితుల్ని,బరువు భాధ్యతల్ని గుర్తించగలిగాడు. ఆఫ్రికా ఖండపు కీకారణ్యాల్లో ఇంతకు పూర్వమెవరు వెళ్లని ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు శుభసందేశ మందించాలను దైవ సంకల్పం తన ద్వారా నెరవేరవలసి యున్నదని. విశ్వసించాడు. ఆ ఖండపు కీకారణ్యాల్లో నివసించే వేలాది ప్రజలకు రక్షణ సందేశం అందించవలసిన బాధ్యత తనపై మోపబడినదని గ్రహించి ఆ సేవకై సంసిద్దుడయ్యాడు.
సింహపు పంజగాయం:-
అందమైన లోయలోనున్న మబోట్సగ్రామాన్ని ఎన్నుకొని అక్కడ మూడు సంవత్సరాలు నివసించాలని తీర్మానించుకొన్నాడు. రాబర్ట్ మఫత్ కుమార్తె (మేరీ మఫత్)ను వివాహమాడి మాబోటాస్కకు వచ్చాడు. ఆ గ్రామ పరిసరాల్లో వాటిని చంపమని ఆయనను కోరారు. వాటిలో ఓకే సింహాన్ని చంపిన,భయంతో మిగతావి పరిపోగలవని తెలిసి,కొందరు ఆఫ్రికన్లను వెంటబెట్టుకొని సింహళ వేటకై బయలుదేరాడు.
ఒక సింహాన్ని కాల్చగా అది డేవిడ్ పైకి దుమికి తీవ్రంగా గాయపరచడం ప్రారంభించింది. కానీ,వెంటనున్న ఆఫ్రికన్లు దానిని చంపగలిగారు. ప్రాణాలు దక్కినా ఆ గాయం తీవ్రమైనందున అది మానడానికి చాలాకాలం పట్టి,ఆ మచ్చ జీవితకాలమంతా ఉంది. ఆయన చనిపోయినప్పుడు ఆ మచ్చ వలన గుర్తుపట్టగలిగారు. ఆ ప్రాంతంలోని ఆఫ్రికన్లలో అనేకులు ప్రభువును వవిశ్వసించారు. అక్కడయినా సంతోషంగా స్థిరంగా తన జీవితకాలం గడిపి ఉండవచ్చును కానీ…
ఉత్తర దిశగా ప్రయాణం:-
నిరంతర జ్ఞానాన్వేషి అయిన డేవిడ్ తన స్థావరాన్ని మరొక చోటికి మార్చాలనే ఉద్దేశ్యముతో ఉన్నాడు. పైగా మాబోట్స్ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడి త్రాగేనీరు లభించడమే కష్టమైంది. అక్కడి ప్రజలు ప్రాణాలు నిలుపుకోవడానికి మిడుతల్ని, కప్పల్ని తినడం చూసి ఆయన అలాగే చేసాడు. ఉత్తరంవైపుగా పయనించి స్థావరాన్నేనుకొనే ప్రయత్నంలో ఇంతవరకు ఎవరూ దాటని పెద్ద ఎడారి తాను దాటవలసి ఉన్నదని తెలిసికొన్నాడు. 300మైళ్ళున్న ఎడారిని దాటెటప్పుడు కొన్నిసార్లు నీళ్లు లేక దాహముతో అలమటించేవాడు. ఒక సంధర్బములో ఎడారిలో నివసించే ప్రజలు ఉష్ట్రపక్షి గుడ్డులో ఇసుకలో దాచుకొన్న నీటినిచ్చారు. అనేక దినాలు ప్రయాణం చేసి ‘నగామి’ అనే సరస్సు కనుగొన్నాడు. ఈ సరస్సును కనుగొన్న మొదటి పాశ్చత్యుడియన. ఇది ఈయన కనుగొనిన మొదటి భౌగోళిక పరిశోధన.
ఒంటరి పయనం:-
ఈ ప్రయాణంలో ఎంతో శారీరక శ్రమ నెదుర్కొన్న భార్య బిడ్డలను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయించడం భావ్యం కాదని గ్రహించి వారిని ఇంగ్లాండ్ పంపివేసి తాను ఒంటరిగా ప్రయాణం కొనసాగించాడు. ఆఫ్రికా ఖండమంతా పయనించి క్రీస్తుప్రభువు రక్షణ సువార్త నందించాలనే ఏకైక లక్ష్యంతో 1855 నుండి 1856 వరకు తూర్పునుండి పడమర వరకు ప్రయాణం చేశాడు. తెల్లవారినెన్నడూ చూడని ఆఫ్రికన్లను ఆయన కలుసుకొన్నాడు . తన ప్రేమ సానుభూతి వలన ఆఫ్రికన్ ఆదిమ జాతుల అభిమానాన్ని చూరగొన్నాడు. వారికీ వైద్య సహాయమందిస్తూ క్రీస్తు రక్షణ సువార్తను బోధించాడు. ఆయనను అనుమానించి ఆటంక పరచిన స్థానికుల మూలాన కొన్నిసార్లు వ్యతిరేకతను ఆటంకాలను ఎదుర్కొనవలసి వచ్చింది.
బానిస వ్యాపారం:-
ఈ ప్రయాణంలో బానిస వ్యాపారుల దుష్క్ ర్యాల్ని కళ్ళార చూడగలిగాడు. వారు ఒక గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామంలోని పెద్దలు మొదలు పిల్లల వరకు అందరిని బంధించి గ్రామాన్ని తగులబెట్టి ప్రజల్ని బానిసలుగా చేసుకొని,వీరు పారిపోకుండా, మెడలకు బరువైన కోయల్ని వ్రేలాడదీసిన బానిస వ్యాపార కేంద్రాలకు నడిపించుకొని తీసుకొని వెళ్లేవారు. మార్గమధ్యంలో బలహీనుల్ని,గాయపడి నడవలేని వారిని అడవుల్లోని వదిలి వెళ్ళిపోయేవారు. మరణించినవారి అస్థిపంజరాలక్కడక్కడ అడవుల్లో ఉండేవి. కళకళలాడుతున్న గ్రామాలూ స్మశానవాటికలుగా మారడం, బానిసల దుస్థితి చూచిన లివింగ్ స్టన్ హృదయం ఎంతో వ్యధచెంది బానిస వ్యాపారం ఆఫ్రికా ఖండంలో “మానని గాయం ” లాంటిదని వర్ణించాడు. హేయమైన బానిస వృత్తిని రూపుమాపి,ఆఫ్రికా ఖండంలో మారుమూల గ్రామాలక్కూడ మిషనరీలు వెళ్లగలిగే మార్గాలు కనుగొనడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. స్థానికులాయనను బానిస వ్యాపారిగా పొరబడి హానిచేయ ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆటంకాలు:-
డేవిడ్ సేవ వలన మారుమనస్సు పొందిన మొదటి విశ్వాసి “మీ దేశస్థులు రక్షణ సందేశాన్ని ఇంతకు ముందే మాకెందుకు తెలుపలేదు. మా పూర్వికులందరు నీవు చెబుతున్న రక్షణను గురించి తెలియక మరణించారు, వారిగతియేమిటి?” అని అడిగాడు. ఈ ప్రశ్నచే కదిలింపబడిన డేవిడ్ తన బాధ్యతను విస్మరించక,విశ్రాంతి నెరుగక ఎన్ని ఆటంకాలైదురైనా, ముందుకు వెళ్ళేవాడు. ఆఫ్రికాలోని వేలాది ఆదిమజాతి ప్రజలాయన ద్వారా రక్షణ సందేశాన్ని విన్నారు. నిరంతర ప్రయాణం వలన కాళ్ళు బొబ్బలై పుండ్లు పడినా,బట్టలు చిరిగినా,ఆహారం లేక ఉపవసించినా లెక్క చేయలేదు. 31 సార్లు జ్వరపీడితుడై,ఎముకల గుడుల ఉన్నా అడవిలో దొరికినవేవో తింటూ కాలం గడిపేవాడు. అనారోగ్యం వలన కొన్నిసార్లు మతిస్థిమితం లేక అనుచరుల పేర్లు, దినాల
పేర్లు కూడా మరచిపోయేవాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులెదురైనా నిరాశ చెందక,తన దగ్గరున్న బైబిల్ చదివి ఆదరణ పొందేవాడు. “ప్రభువునందు నేను ధైర్యపడుతున్నాని”తన డైరీలో వ్రాసుకొన్నాడు. “బానిస వ్యాపారులే ఇంత దూరం రాగలిగినప్పుడు క్రీస్తు ప్రేమ మనలనింకేంత దూరం పంపాలో అని ప్రశ్నించేవాడు.
కీర్తి:-
ఆఫ్రికాలో ఆయన కనుగొన్న నదులు, సరస్సులు అయనకెంతో కీర్తి ప్రతిష్టలనార్జించాయి. విక్టోరియా జలపాతాన్ని సంపించడానిక్కూడా భయపడి “శబ్దమొచ్చే పొగ” అని స్థానికులు పిలిచేవారు. ఆ జలపాతాన్ని కనుగొన్నాడు. డేవిడ్. పదహారు సంవత్సరాల అనంతరము స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనను స్వదేశీయులెంతో గౌరవించారు. ఆఫ్రికాలో కాలినడకను 9000మైళ్ళు ప్రయాణం చేసిన ఈ దైవజనుని స్వదేశంలో బిరుదులు,బంగారు పతకాలు కోరుకుండా ఆయన సేవకు గుర్తింపుగా లభించాయి. ఆయనను చూడాలని,ఆయన మాటలు వినాలని దూరమనుకుండా ఎందరో ప్రజలు వచ్చేవారు. పత్రికలన్నీ ఆయన గురించే వ్రాశాయి. తన ప్రయాణాల గురించి స్వయంగా ఆయన ఒక పుస్తకం వ్రాశాడు.
పునరాగమనం:-
ఈసారి ప్రభుత్వోద్యోగిగా ఆఫ్రికా తిరిగి వచ్చాడు. ప్రభుత్వం వారాయనకు వేతనమిచ్చినా,మిషనరీ సేవ,భౌగోళిక పరిశోధనలు చేయవచ్చునని అనుమతిస్తూ,కొందరు సహాయకులు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఆ ప్రాంతంలో వ్యాపించిన జ్వరం వలన వీరిలో ఒక్కరొక్కరే మరణించారు. కొంతకాలం తరువాత ఆయన భార్య కూడా ఆయనను కలుసుకొన్నది. కానీ 3 నెలల తర్వాత జ్వరపీడితురాలై ఆమె మరణించినది భార్య మరణం ఆయన నెంతగానో కృంగదీయగా “దుఃఖం నేను భరించలేనిదని”తన డైరీలో వ్రాసుకొంటూ “ఇహలోక సంబంధమైనదేది నిరాశతో నా పని నుండి నన్ను తొలగింపలేదు. నా ప్రభువులో నేను బలపడుతూ ఈ సేవలో తన ముందంజ వేస్తున్నానని” తన డైరీలో వ్రాసుకొన్నాడు.
ఒకసారొక ఖడ్గమృగమాయనను పోవడానికి మీదకు వస్తూ హఠాత్తుగా ఆగిపోయినది. మరొకసారి ఒక ఆఫ్రికా జాతివాడు బల్లెం విసరగా ఆయనను తాకుతూ పోయి అది వెనుకనున్న చెట్టుకు గూర్చుకొన్నది. ఆయన ప్రాణాపాయ సమయాలన్నింటిలో కాపాడుతూ,ఆయన సేవ ముగిసేవరకు పదిల పరిచాడు దేవుడు. ఆయనను తన ప్రభుత్వాధికారిగా నియమించిన ఆంగ్లేయ అధికారులు బానిస వ్యాపారుల ప్రభావం వలన వేతనం పంపడం మానివేయగా, ఆయన ఆర్ధిక ఇబ్బందుల నెదుర్కొనవలసి వచ్చింది. ఆఫ్రికాలో సేవ కొనసాగించలేని పరిస్థితుల్లో దేవుడు స్వదేశములోని మిత్రుల నుండి ఆర్ధిక సహాయాన్నందించాడు.
చివరియాత్ర ప్రయత్నం:-
నిరంతర ప్రయాణం వలన,స్థానికుల వ్యతిరేకత,తన సేవకుల దుష్టస్వభవం వలన ఆయన అడుగడుగునా ఆటంకాలెదుర్కొన్నా సేవలో వెనుకంజ వేయలేదు,దుష్టులైన సేవకులు ఆయన దగ్గరున్న వస్తువుల్ని,ఆహార పదార్ధాలు,ఆయనకు వచ్చే ఉత్తరాలు దొగింలించేవారు. లివింగ్ స్టన్ తన వస్తువులన్నీ ప్రయాణారంభములో ఒక అరబ్బీ వర్తకుని దగ్గర దాచాడు. చాల కాలం లింగ్ స్టన్ గురించి ఏ కబురు తెలియనందున అతడా వస్తువులన్నింటినిఅమ్మేశారు. ముష్కరులైన ఆఫ్రికన్ల మధ్య తిండి, బట్టలు లేక బికారిలాగా జీవించాడు డేవిడ్. ఆయన రాసిన ఉత్తరాలన్నింటిని బానిస వ్యాపారులు నాశనం చేసేవారు. ఆయన మందులపెట్టె కూడా లేకపోవడం వలన సరియైన చికిత్స చేసికొనలేకపోయేవాడు. బయటి ప్రపంచానికాయన గురించి ఏ సమాచారం తెలియకపోవడం వలన అందరు ఆయన చనిపోయాడనే అనుకొన్నారు. కానీ దేవుడాయనను మరచిపోలేదు.
ఈ పరిస్థితుల్లో న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక సంపాదనకు లివింగ్ స్టన్ గురించి తెలిసికొనడానికి హెన్రిస్టాన్లీ అను వ్యక్తిని పంపాడు. అనేక దినాలు ప్రయాణం చేశాక ‘ఉజిజి ‘అనే స్థలంలో స్టాన్లీ ఆయనను కలుసుకొని,తాను తెచ్చిన మందులు ఆహార పదార్దాల నందించాడు. అవి డేవిడ్ కెంతో ఉపయోగపడ్డాయి. కొన్ని నెలలు డేవిడ్ తో కలసి నివసించిన తర్వాత స్టాన్లీ క్రీస్తును పోలి జీవిస్తున్న ఆయన జీవితం వలన ఎంతో ప్రభావితుడై నాస్తికుడైన స్టాన్లీ విశ్వాసిగా మారాడు. డేవిడ్ తో కలసి జీవిస్తున్న అనాగరిక,ఆటవిక ప్రజా సమూహాన్ని,ఆయన ఎదుర్కొంటున్న అసౌకర్యాల్ని కళ్ళరా చుసిన స్టాన్లీ,స్వదేశంలో కీర్తి ప్రతిష్టల్ని,సౌకర్యాన్ని,వదులుకొని బుద్ధిపూర్వకంగా కష్టాల్ని కోయి తెచ్చుకోవడం ఎందుకని,స్వదేశానికి తిరిగి రమ్మని కోరాడు. కానీ,తనలక్ష్యం నెరవేరేవరకు స్వదేశానికి మరలివచ్చేది లేదని స్పష్టాంగా చెప్పేశాడు డేవిడ్.
అంతిమ యాత్ర:-
మరొక సంవత్సరం లింగ్ స్టన్ ప్రయాణం చేశాడు. ఆయన అభిమానించే ఆఫ్రికన్ సహచరులు,బలహీనంగా ఉన్న దావీదును డోలీలో మోసుకుపోయేవారు. వర్షాలు ప్రారంభమవడంతో ఆయన అనారోగ్యం తీవ్రమై,డైరీ వ్రాసుకోవడానికి కూడా శక్తిలేని వాడయ్యాడు. క్రమంగా ఆయనలోని శక్తి క్షిణిస్తున్న విషయాన్ని గమనించిన అనుచరులు ఆయనను ఒక పూరింటిలో ఉంచి ప్రేమతో పరిచర్య చేసేవారు. 1873 సంవత్సరంలో మే నెలలో ఒకనాటి ఉదయాన వారాయన గదిలో ప్రవేశించినపుడు దిండుపై తన రెండు చేతులుంచి పడక ప్రక్కనే మోకరిల్లి మరణించిన డేవిడ్ ను వారు చూశారు. ఆఫ్రికాలోని వేలాదిమంది ప్రజల ఆత్మీయ క్షేమాభివృద్ధికై విజ్ఞాపన చేస్తూనే తుదిశ్వాస విడిచాడేమో!
1 సమూయేలు 2:30 “నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురని చెప్పబడిన ప్రకారం తనను గౌరవించిన లివింగ్ స్టన్ను దేవుడు ఘనపరచాడు. ఈనాడు స్ఫటికాలో బానిస వ్యాపారం నిషేధించబడినది. ఈ ఖండపు మారుమూలల్లోకూడా సువార్త సందేశం వినిపిస్తున్న మిషనరీలున్నారు. దేవుని గౌరవించి,విదేయుడైన లివింగ్ స్టన్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనుకనే ఒకనాటి చీకటి ఖండం రూపురేఖల్లో ప్రజాజీవనంలో ఆత్మీయ చైతన్యం తొణికిసలాడుతుంది.


Leave a Reply